BRS | దేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం ఖమ్మం వేదికగా ఆవిష్కృతమైంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమం గుజరాత్ నుంచి ప్రారంభమైనట్టే, ఇప్పుడు ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దె దింపే పోరాటం తెలంగాణ నుంచి ఆరంభమైంది. మొక్కవోని దీక్షతో తెలంగాణ సాధించిన కేసీఆర్, పరిపాలకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తీరు దేశానికే ఆదర్శంగా మారింది. తెలంగాణ నమూనా ప్రాతిపదికగా దేశానికి ప్రత్యామ్నాయ ప్రణాళికను కేసీఆర్ ప్రతిపాదించారు. రైతు సంక్షేమాన్ని ప్రధాన స్రవంతి రాజకీయంగా మార్చడం కేసీఆర్ ఘనత. ఈ ప్రత్యామ్నాయ ప్రజా సంక్షేమ ప్రణాళికే ఊపిరిగా బీఆర్ఎస్ పురుడు పోసుకున్నది. దేశంలో ప్రతిపక్ష ఐక్య పోరాటానికి కేసీఆర్ కేంద్ర బిందువుగా నిలిచారనడానికి బీఆర్ఎస్ ఆరంభ సభనే ఒక సూచిక. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టించనుండగా, ఖమ్మం సభ ఆ భూకంప కేంద్రంగా మారింది. నలుగురు ముఖ్యమంత్రులు సభలో పాల్గొననుండగా, పలువురు జాతీయ నేతలు బీఆర్ఎస్కు సంఘీభావం తెలుపనున్నారు.
‘స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాక లక్షల కోట్ల జెన్కో, ట్రాన్స్కో ఆస్తులు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నయ్. అవి ప్రజల ఆస్తులు. అప్పనంగా లాస్ చూపించి షావుకార్లకు షావుకార్లకు అప్పజెప్పి ప్రజల ముక్ముపిండి దాన్ని ప్రైవేటు చేసి అప్పనంగా అమ్ముతాముంటున్నారు. భారతదేశంలాంటి పెద్ద దేశంలో కరెంటు ముఖ్యమైన విషయం కాబట్టి, ప్రగతి సూచికల్లో మొదటి కాబట్టి.. కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టార్లోనే ఉంచుతాం.. ఇదే బీఆర్ఎస్ పాలసీ.. కరెంటు కార్మికులారా.. పిడికిలి బిగించాలి’ అన్నారు. ఇక మాట్లాడమంటే రేకుడబ్బాలో గులకరాళ్లు వేసి ఊపినట్లే లోడాలడ. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నిండా నీళ్లున్నా.. మంచినీళ్లివ్వలేని అసమర్థ పాలకులు కావాలా? ఇంకా చాలదా? మనకు సిగ్గు రావాద్దా..? కరెంటు ఇవ్వరు.. నీళ్లు ఇవ్వరు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నదన్నట్టు ఎందుకు మోసపోవాలి’ అని ప్రశ్నించారు. ‘కరెంటుకు లక్షల మెగావాట్లకు అవకాశం ఉంది. దేశంలో కోసి, గండకీ నదులు బిహార్ను కరువులు, వరదలతో ముంచెత్తుతున్నయ్. ప్రతి సంవత్సరం సగం బిహార్ వరదలు, సగం బిహార్ కరువు. హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ పెడితే అద్భుతమైన కరెంటు వచ్చే పరిస్థితి ఉంది. ప్రజలను మోసం చేసేందుకు, గోల్మాల్ చేస్తున్నారు’ అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ ను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. " దేశంలో మతపిచ్చి లేపుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతున్నాడని, మళ్లీ పబ్లిక్ సెక్టార్లో పెడుతామన్నారు. వ్యవసాయాన్ని సైతం ప్రైవేటీకరణ చేసి మన భూముల్లో జీతాలకు ఉండే పరిస్థితి ఉండే కుట్ర జరుగుతుంది. జ్ఞానం లేకపోతే.. ఎక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకోవాలి. ప్రపంచదేశాల నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలి. చైనా, సింగపూర్ తదితర దేశాలతో ముందుకువెళ్లాలని కోరుకుంటున్నాం.. అగ్నిపథ్ను కూడా రద్దు చేస్తాం. సైన్యంలో జరిగే నియామకాలు పద్ధతి ఉండాలి. సైన్యానికో సిస్టమ్ ఉండాలి. రేపు విపక్షాల ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తుంది. పాత పద్ధతిలోనే కొనసాగిస్తాం. ఏ రకంగా ప్రతిపక్షాలను వేధిస్తున్నారో.. తమ అసమర్థతను, చేతగాని తననాన్ని కప్పిపుచ్చుకునేందుకు మత విద్వేషపు మంటలు రేపుతున్నారు" అని సీఎం కేసీఆర్ అన్నారు.
దేశంలో నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నయని, ఇలాంటి దుర్మార్గానికి కారణం ఎవరు అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు రెండే అని అన్నారు. కాంగ్రెస్ ఉంటే బీజేపీని తిట్టడం.. బీజేపీ ఉంటే కాంగ్రెస్ను తిట్టడం అలవాటుగా మారిందన్నారు. ఈ తిట్ల పురాణం మనకు కావాల్నా? ఈ గొంతు తడవాల్నా? మన పొలాలు తడవాల్నా? పంటలు పండాల్నా? అనేది దయచేసి దేశ ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
దేశంలో లక్షా 40 వేల టీఎంసీల నీరు ఉంటే రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నయ్ అని సీఎం కేసీఆర్ ఖమ్మం సభ ద్వారా ప్రశ్నించారు. " సట్లేజ్ దాని ఉపనదులు రావి, బియాస్ నీళ్ల కోసం పంజాబ్, హరియాణా రోజు తన్నుకుంటయ్. ఎందుకు తన్నుకోవాలి. మహానది నీళ్ల కోసం ఒడిశా, చత్తీస్గడ్ యుద్దం, నర్మదా జలాల కోసం గుజరాత్, మద్యప్రదేశ్ మధ్య కొట్లాట.. కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు కర్నాటక మధ్య యుద్ధం.. గోదావరి నదుల మీద మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ. ఇవే ఇట్లే కొనసాగాలా..? చాటలో తవుడు పోసి కుక్కలకు కొట్లాటలు పెట్టినట్లు, రాష్ట్రాల మద్య తాకులాటలు పెట్టి.. శాతగాక , పరిపాలన చేయలేక.. చట్ట స్ఫూర్తి తేక.. ఏ అప్పు అవసరం లేనటువంటి.. ఎవరినీ అడుక్కునే అవసరం లేనటువంటి.. బ్రహ్మాండమైనటువంటి ప్రకృతో, భగవంతుడో ఇచ్చినటువంటి సహజ సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివిలేక.. డొల్ల మాటలు, కల్ల మాటలు చెబుతూ పొద్దుగుచ్చే పరిపాలకులు ఉండాల్నా..? తెలంగాణలో కాళేశ్వరం కాలేదా.. పాలమూరు అయితలేదా.. సీతారామ ఖమ్మంలో పరుగులు పెడ్తలేదా.. సంకల్పం, చిత్తశుద్ది ఉంటే కాదా.. అయితది" అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
దీన్ని ప్రశ్నించడానికి, దీన్ని సాధించడానికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రజల ఆస్తి.. ప్రజల పాలు కావడానికి అనవసరంగా పెట్టబడుతున్న, పెడుతున్న కష్టాల నుంచి ఈ భారత జాతిని విముక్తి చేయడం కోసం పుట్టిందే బీఆర్ఎస్. వేరే ఉద్దేశం లేదు అని మరోసారి స్పష్టం చేశారు.
కచ్చితంగా ఆరు నూరైనా సరే.. తెలంగాణ ఉద్యమంలాంటిది దేశవ్యాప్తంగా ఉద్యమం వచ్చైనా సరే.. ప్రభుత్వాల మెడలు వంచి.. సహజ సిద్ధంగా భగవంతుడి ఇచ్చిన ప్రకృతి సంపద భూమ్మీదకు రావాలని కేసీఆర్ అన్నారు. దాని కోసం పోరాటం జరగాలని అన్నారు. లేకపోతే మనం ముందుకు పోలేం అని అన్నారు. " ఒక బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాల్నా.. తన్నీరుతన్నీరు సినిమా వచ్చినా కూడా దాన్ని చూసి మనకు సిగ్గు రాదా .. దేనికోసం లొడా లొడా రాజకీయాలు మాట్లాడటం.. గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పడం ఇదేనా భారత దేశం.. ఇదేనా భారత దేశ పరమార్థం అని ప్రశ్నించారు.
ఖమ్మం సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల కారణాలను సీఎం కేసీఆర్ వివరించారు. " జింబాంబ్వే అనే దేశంలో 6,533 టీఎంసీల రిజర్వాయర్ జాంబేజీ నది మీద ఉంది. రష్యాలో అంగారా నది మీద 5,968 టీంఎసీల ప్రాజెక్టు ఉంది. వోల్టా నది మీద ఘనా దేశంలో 5085 టీఎంసీల ప్రాజెక్టు, కెనడాలో మనీకూగాన్ నది మీద 4944 టీంఎసీల ప్రాజెక్టు , ఈజిప్టులో నైలు నది మీద 4500 టీఎంసీల ప్రాజెక్టు, చైనాలో యాంగ్జీ నది మీద 1400 టీఎంసీల ప్రాజెక్టు.. అమెరికాలోని కొలరాడో నది మీద 1200 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. మరి మన దేశానికి ఏమైంది. ? సువిశాల దేశం.. 139 కోట్ల జనాభా.. కరువులు చూసినం, కాటకాలు చూసినం.. వరదలు చూస్తున్నం.. ఇలాంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా వద్దా మన మొఖానికి.. మనం నోసుకోలేదా.. ఇప్పటికీ మంచినీళ్లకు బాధపడాలా.. సరైన పరిపాలన వచ్చి.. నదుల నీళ్లు భూమ్మీదకు మళ్లి.. ప్రజల దాహం.. పొలాల దాహం తీర్చాల్నా.. మనం సన్నాసులెక్క ఇట్లే ఉండాల్నా? దయచేసి దేశం ఆలోచించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం సభ ద్వారా ఈ దేశాన్ని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రశ్నించడానికి.. ఈ చైతన్యం తేవడానికి.. దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కోట్లాది మందికి ఈరోజుకీ విషపు మంచినీళ్లా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ పాపం ఎవరిది అన్నారు. " భారత దేశానికి ఒక లక్ష్యం ఉందా.. దేశం లక్ష్యం కోల్పోయింది.. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో వేసిన కొన్ని ప్రణాళికలు, కట్టిన కొన్ని ప్రాజెక్టులు తప్పా.. అతీ గతీ లేదు. మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి 19 ఏండ్లు గడిచిపోయి 20 ఏండ్లలోకి అడుగుపెట్టినం. హరీ లేదు శివా లేదు. ఆ జడ్జి ముసలివాడు. నలుగురు తీసుకొచ్చి కూర్చొబెడతారు. ఆయన ఎప్పుడు హరీ అంటడో ఎవరికీ తెలియదు. 20 ఏండ్లు దాటుతుంటే ట్రైబ్యునల్ ఉలుకూపలుకూ లేకుంటే తీర్పు వచ్చేదెప్పుడు. వాళ్ల మీదున్న గ్రీన్ ట్రైబ్యునల్ లాంటివి క్లియరెన్స్ ఇచ్చేది ఎప్పుడు. డిజైన్లు అయ్యేదెప్పుడు. నిధులు సమకూరేదెప్పుడు. ప్రాజెక్టులు కట్టేదెప్పుడు. ప్రజలకు సాగునీళ్లు, తాగు నీళ్లు వచ్చేదెప్పుడు. దీనికి ఏమైనా అమెరికాను అడుక్కోవన్నా. అంతర్జాతీయ రాజనీతి కావాల్నా. ప్రపంచబ్యాంకు వద్ద చిప్ప పట్టుకోవన్నా. ఏది అవసరం లేదు కదా.. ఇది నిజం కాదా.. మంచినీళ్లు ఇయ్య శాతకాదు.. కహానీలు చెప్పి కథలు చెప్పి.. ప్రజల్ని గోల్ మాల్ తిప్పుడు ఎందుకు. ఎక్కడ మనం మోసపుతున్నాం" అని ప్రశ్నించారు.
" అమెరికా మనకంటే రెండున్నర రెట్లు పెద్దగుంటది.. కానీ అక్కడున్న వ్యవసాయ భూమి 22 శాతమే. చైనా మనకంటే ఒకటిన్నర రెట్లు పెద్దగుంటది వాళ్లకున్న వ్యవసాయ భూమి 16 శాతం. భారత దేశం భూభాగం 83 కోట్ల ఎకరాలు.. ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు అంటే సగం భూమి వ్యవసాయానికి అనుకూలం. అపారమైన జల సంపద లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తుంది. 70 వేల టీఎంసీలు ఆవిరైతే.. మనం ఉపయోగించుకునే నీరు 70-75వేల టీఎంసీల నీరు. భూమి ఉంది.. నీరు ఉంది.. పంటలు పండటానికి అవసరమైన సూర్యరశ్మి అద్భుతంగా కలిగి ఉన్న దేశం మనది. సముద్ర తీర ప్రాంతాలలో ఉండేటువంటి హ్యూమిడిటీ వాతావరణ కావొచ్చు.. సముద్ర తీరం లేనటువంటి.. మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు, పంజాబ్, హిమాచల్, కశ్మీర్ లాంటి శీతల రాష్ట్రాలు కావొచ్చు.. మూడు డిఫరెంట్ ఆగ్రోటిక్ జోన్స్ దేశంలో ఉన్నాయి" అని సీఎం కేసీఆర్ అన్నారు.
" భారత దేశంలో యాపిల్ పండుతుంది.. మామిడి కాయ కూడా పండుతుంది. ఇతర దేశాల్లో ఇలాంటి వాతావరణం ఉండదు. కష్టించి పనిచేసే దేశంలోని 130 కోట్ల జనాభాలో మనం తినేది మెక్డోనాల్డ్ పిజ్జాలు.. మెక్డోనాల్డ్ బర్గార్లా మనం తినేవి ? ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి.. అద్భుతమైన పంటలు పండించి.. సాగు నీళ్లు పైకి తెచ్చి దానికి కనెక్టెడ్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టి.. అందులో కోటాను కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి బెస్ట్ ఫుడ్ చైన్ ఆఫ్ వరల్డ్ గా ఉండాల్సినటువంటి.. భారత్ ఇవాళ కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటదా.. ఇంతకన్నా సిగ్గు చేటు ఇంకేమైనా ఉంటదా? లక్ష కోట్ల రూపాయల విలువైన ఫామాయిల్ను దిగుమతి చేసుకుంటదా.. ఇంతకన్న సిగ్గు చేటు ఉంటదా" అని కేసీఆర్ అన్నారు.
ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. " రాజకీయాలు జరుగుతుంటాయి. గెలుపు ఓటములు సహజం. కానీ భారత దేశం , భారత సమాజం లక్ష్యం ఏంటి.. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా.. దారి తప్పిందా.. బిత్తరపోయి గత్తర పడుతుందా.. ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో.. ఈ విషయం మీద నా అంతరాత్మ అనేక రకాలుగా కలిచి వేస్తా ఉంది. అందరూ సీరియస్గా ఆలోచించాలి" అని పిలుపునిచ్చారు.
దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి, ఏ ప్రపంచ బ్యాంకు తీసుకునే అవసరం లేనటువంటి .. ఏ అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేనటువంటి.. ఏ విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి.. సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు అని కేసీఆర్ అన్నారు. దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమైతుంది అని ప్రశ్నించారు. దేశంలో సంపద లేకుంటే బిక్షం ఎత్తుకుంటే తప్పులేదు. కానీ ఉండి మనం ఎందుకు యాచకులం కావాలని ప్రశ్నించారు.
ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు, జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మంలోని గ్రామ పంచాయతీలకు వరాలు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పెద్దతాండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేల జనాభాకు మించి ఉండి.. మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి మరొక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలకు మధిర, వైరా, సత్తుపల్లి కి తలా రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను జేఎన్టీయూ ఆధ్వర్యంలో మంజూరు చేస్తామని ప్రకటించారు.
దేశాన్ని అభివృద్ధి చేయడం ఎలా.. రైతులకు ఏం చేయాలి, కార్మికులకు ఏం చేయాలనే దానిపైన ఇవాళ ముఖ్యనేతలందరం కలిసి చర్చించామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కేరళలో విద్యాసంస్థలు అద్భుతంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితి దేశంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందన్నారు. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులకు అడ్గుతగలడమే గవర్నర్ల పని అన్నట్లు ఉందని కేజ్రీవాల్ అన్నారు. గవర్నర్లు కేవలం కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు.
కేసీఆర్ మాకు పెద్దన్న లాంటివారు అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమం అని, కంటి వెలుగు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ, పంజాబ్లోనూ ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు. తెలంగాణలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతమని కొనియాడారు.
దొడ్డి దారిలో అధికారంలోకి రావడంలో బీజేపీ నంబర్ వన్ అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. మోదీ ప్రజల కోసం కాదు తన మిత్రుల కోసం పని చేస్తున్నారని అన్నారు. ఎర్రకోటపై మోదీ 8 ఏళ్లుగా ఒకేరకమైన మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలను మోదీ ఎలాగూ మార్చలేకపోతున్నారని, కనీసం తన ప్రసంగాన్నైనా మార్చుకోవాలని సూచించారు.
తెలంగాణలో అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమం అద్భుతమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కొనియాడారు. ఖమ్మం సభలో భారీ జనసందోహాన్ని చూసి భగవంత్మాన్ ఉప్పొంగిపోయారు. ఇంతమందిని చూడటానికి కేసీఆర్ తమకు ప్రత్యేక అద్ధాలు ఇవ్వాలంటూ చమత్కరించారు.
బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని అన్నారు. విపక్షాల ఎమ్మెల్యేలను కొనాలి.. అధికారంలోకి రావాలి ఇదే బీజేపీ సూత్రం అని విమర్శించారు. అన్ని సమయాలు ఒకేలా ఉండవని, రాజు బికారి అవుతాడని, బికారి రాజు అవుతాడని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశమనే పుష్ఫగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులు ఉంటేనే బాగుంటుందన్నారు. కానీ కొందరు ఒకే రకమైన పువ్వును కోరుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణ పోరాట యోధులకు పుట్టినిల్లు అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా అన్నారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగం కనీస అవసరాలని, ఈ రంగాల్లో తెలంగాణ ముందుందని కొనియాడారు. కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతుబంధు, దళితబంధు లాంటి అద్భుత పథకాలను తెలంగాణ అమలు చేస్తుందని కొనియాడారు.
దేశానికి బీజేపీ ప్రమాదకారిగా తయారైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా అన్నారు. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి దేశ మౌలిక వ్యవస్థల్నే మార్చాలని చూస్తున్నాయని అన్నారు. భారత దేశం ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభంలో ఉందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశానికి ముప్పుగా తయారయ్యాయని అన్నారు. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని అన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారని అన్నారు.
యాదరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అద్భుతంగా ఉందని, కేసీఆర్ అద్భుతంగా ఆలయ నిర్మాణం చేపట్టారని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కొనియాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొండంత పనిచేసి గోరంత చెప్పుకుంటున్నారని, అదే కొందరు గోరంత చేసి కొండంత చెప్పుకుంటున్నారని మోదీని ఉద్దేశించి అఖిలేశ్ ఎద్దేవా చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. కేంద్రం రోజులు లెక్కబెట్టుకుంటోందని, ఇవాల్టితో ఇంకా 399 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. రైతులను ఆదుకుంటామని మోదీ మాటతప్పారని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని మోసం చేశారని అన్నారు. దర్యాప్తు సంస్థలను చూపి ప్రతిపక్షాలను బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. కేసుల పేరుతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.
ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభపై ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అశిలేశ్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్కు అఖిలేశ్ యాదవ్ కృతజ్ఞతలు చెప్పారు. ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్న అఖిలేశ్ యాదవ్.. ఇక్కడి కలెక్టరేట్లు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్రతిపక్ష నేతలను బీజేపీ బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు.
దేశంలో గవర్నర్ కార్యాలయాలు బీజేపీ ఆఫీసులుగా మారిపోయాయని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. కేంద్ర మంత్రులు.. నేరుగా సుప్రీం కోర్టును బెదిరిస్తున్నారని అన్నారు. . ఉపరాష్ట్రపతి కూడా సుప్రీంను కించపరిచేలా మాట్లాడరని విమర్శించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని కాపాడాలని అన్నారు.
ప్రధాని మోదీ కార్పొరేట్లకు తొత్తుగా మారారని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. రాష్ట్రాలను కేంద్రం లెక్కలోకి తీసుకోవడం లేదని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి మోదీ తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.
ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశానికి ఒక దిక్సూచి అని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిందేనని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేసీఆర్ పోరాటానికి మా మద్దతు ఉంటుందని ప్రకటించారు.
దేశంలో ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా పరిణమించిందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. రాజ్యాంగానికి కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టారని కేరళ సీఎం పినరయి విజయన్ కొనియాడారు. ప్రజల సౌకర్యార్థం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. లక్షలాది మందికి ఉపయోగపడే కంటి వెలుగు పథకం అద్భుతమని కొనియాడారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ వేదిక వద్దకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రివాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా చేరుకున్నారు. వేదికపై ఆశీనులయ్యారు.
బీఆర్ఎస్ తొలి సభ విజయవంతం కావాలని, పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కోరుతూ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఖమ్మంలో సర్వమత ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణ దేవాలయం, సాయిబాబా ఆలయం, క్రీస్తు మందిరాల్లో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన వారిలో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడి రాజీవ్సాగర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు ఉన్నారు.
సీఎం కేసీఆర్తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాక సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నూతన కలెక్టరేట్ ప్రారంభం వద్ద కొందరు ఎమ్మెల్యేలు, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు తమ వాహనాలతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలిపివేశారు.సభలో ఎవరు అస్వస్థతకు గురైనా, ఏదైనా అనారోగ్యం సంభవించినా వెనువెంటనే స్పందించేందుకు సభా ప్రాంగణంలో ప్రథమ చికిత్సా కేంద్రాన్ని సిద్ధంగా ఉంచారు.
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రారంభించారు. కలెక్టరేట్లో మొదట నేతలు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండో విడుత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు.
అనంతరం రెండో విడుత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్ధిదారులు ధరవాత్ బిచ్చమ్మ, మందా అన్నపూర్ణ, రామనాథం, కోలం జ్యోతి, వెంకటేశ్వర్లు, షేక్ గౌసియా బేగంకు నేతలు సీఎం పినరయి విజనయ్, అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ మాన్, సీఎం కేసీఆర్, అఖిలేశ్ యాదవ్, డీ రాజా కంటి అద్దాలను అందజేశారు.
ఖమ్మం సమీకృత కలెక్టరేట్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవం చేశారు.
శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సహా ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు ఖమ్మం బయలుదేరారు. మరికాసేపట్లో ఖమ్మం కలెక్టరేట్కు చేరుకోనున్నారు.
ఆప్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కృష్ణ శిలలలో నిర్మించిన ఆలయాన్ని ఆసాంతం ఆసక్తిగా పరిశీలించారు. ఆలయ నిర్మాణ శైలిని చూసి అబ్బురపడిపోయారు. ముఖ్యమంత్రి సంకల్ప బలాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొనియాడారు. ఆలయాన్ని ఆధునీకరించిన విధానం, ఆలయ విశిష్ఠతలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు.
ఆప్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్తో కలిసి ఆలయ గర్భాలంయలో ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రీశుడిని దర్శించుకుని తరించిపోయారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దేశంకోసం, భారతదేశ బాగు కోసం ఖమ్మంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభకు జిల్లాల నుంచి ప్రారంభం అయ్యారు. ప్రజలతోపాటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బస్సులు, లారీలు, ఇతర వాహనాల్లో సభకు బయలుదేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరిపెడ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పార్టీ కార్యకర్తలతో కలిసి బస్సులో వస్తున్నారు. ఇక మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట నుంచి లారీలో బయలుదేరారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రులు కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మేళ తాళాలతో ఆహ్వానం పలికారు. గర్భాలయంలో స్వయంభువుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రులకు వేదాశీర్వచనం అందించారు. అధికారులు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను అందజేశారు.
ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉదయం వీరంతా ప్రగతిభవన్కు వెళ్లారు. ఈ సందర్భంగా జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డి. రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
Chief Ministers, national leaders and farmers' representatives of many states already reached Hyderabad to attend the BRS (Bharat Rashtra Samithi) party's mammoth meeting to be held in Khammam.#BRSforIndia #AbkiBaarKisanSarkar pic.twitter.com/SUdxNzws0w
— BRS Party (@BRSparty) January 18, 2023
సభకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివస్తున్నారు. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ కాన్వాయ్తో ఖమ్మం బయలుదేరారు. ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద భారీ ఎత్తున కార్యకర్తలతో హైదరాబాద్ నుంచి పయణమయ్యారు. పాలకుర్తి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ రావు, మానకొండూరు ఎమ్మె్ల్యే రసమయి బాలకిషన్ సభకు బయలుదేరారు. ఆయా నియోజకవర్గాల నుంచి ఖమ్మం తరలివెళ్తున్న కార్యకర్తల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు నుంచి 250 కార్లలో కార్యకర్తలు, అభిమానులు ఖమ్మం సభకు వస్తున్నారు.